24. ఆత్మ దేహాలను మారుస్తుంది
ఆత్మ చంపదు లేక చంపబడదు; అజ్ఞానులు మాత్రమే ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారని శ్రీకృష్ణుడు(2.19, 2.20) అంటారు. అది పుట్టుక లేనిది, శాశ్వతమైనది, మార్పులేనిది, పురాతనమైనది. ఇంకా, మనం చివికిపోయిన, పాతవి అయిన వస్త్రాలను వదిలివేసి కొత్తవి ధరించినట్లుగా, ఆత్మ భౌతిక దేహాలను మారుస్తుందని ఆయన అంటారు.
సాంకేతిక పరిభాషలో దీన్ని శక్తి పరిరక్షణ సూత్రం (law of conservation of energy), ద్రవ్యరాశి, శక్తి యొక్క పరస్పర మార్పిడి సూత్రం (principle of inter-convertibility of mass and energy) ద్వారా బాగా అర్ధం చేసుకోవచ్చు. ఆత్మను శక్తితో పోలిస్తే కృష్ణ భగవానుని మాటలు బాగా స్పష్టమవుతాయి.
శక్తి పరిరక్షణ సూత్రం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చగలం. ఉదాహరణకు ఉష్ణశక్తి స్థానాలు (థర్మల్ పవర్ స్టేషన్లు) ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక బల్బు విద్యుత్ శక్తిని కాంతిగా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం శక్తి మార్పిడి జరుగుతోంది కానీ నాశనము కాదు. బల్బు జీవితం పరిమితకాలం. ఇది కాలిపోతే కొత్త బల్బును పెడతాము కానీ విద్యుత్తు అలాగే ఉంటుంది. ఇది జీర్ణమైన వస్త్రాలను విడిచి కొత్తవాటిని తొడుక్కోవడం వంటిది.
మనకు చావు ఒక అనుమానం మాత్రమే అనుభవం కాదు. ఇతరులు చనిపోవడం చూసినప్పుడు మనందరం కూడా ఏదో ఒక రోజు మరణిస్తామని అనుమానించి అర్థం చేసుకుంటాము. మనకు తెలిసింది చావు అంటే దేహం కదలక పోవడం, ఇంద్రియాలు పనిచేయకపోవడం. మన భౌతిక మరణం గురించి తెలుసుకునే అవకాశం కానీ, దాన్ని అనుభూతి చెందే మార్గం కానీ మనకు తెలియదు. కానీ మన అందరికీ మరణం తధ్యమని మనం అనుమానిస్తాము. మన జీవితాలు మరణం చుట్టూ దానికి సంబంధించిన భయాల చుట్టూ తిరుగుతాయి.
కృష్ణ భగవానుడు 'ఏదైనా సాధ్యమే కానీ మరణం సాధ్యం కాదు, ఎందుకంటే అది ఒక భ్రమ' అంటారు. బట్టలు చిరిగి పోయినప్పుడు అవి మనల్ని పరిసరాల నుంచి సంరక్షించలేవు. అందుకే కొత్త వాటిని వేసుకుంటాము. అలాగే మన భౌతిక దేహం దాని ధర్మాలను నిర్వహించలేనప్పుడు అది మార్పు చేయబడుతుంది.
0 notes
23. ఆత్మ అవ్యక్తమైనది
శ్రీకృష్ణుడు అర్జునుడితో (2.25) “ఇది” (దేహి/ఆత్మ) అవ్యక్తమైనది, అనూహ్యమైనది, వికారరహితమైనదని చెప్పి, ఒకసారి మీరు దీని గురించి తెలుసుకుంటే, భౌతిక శరీరం కోసం దుఃఖించ వలసిన అవసరం లేదని అంటారు. ఇంకా, పుట్టుకకు ముందు అన్ని జీవులు అవ్యక్తంగా ఉంటాయని, ���ుట్టుకకు చావుకు మధ్య మాత్రమే వ్యక్తమవుతాయని, తిరిగి మరణించాక అవ్యక్త (అదృశ్య) మవుతాయని శ్రీకృష్ణుడు (2.28) బోధిస్తున్నారు.
అనేక సంస్కృతులు దీనిని వివరించడానికి సముద్రము, అలల పోలికలు ఇస్తాయి. సముద్రం అవ్యక్తాన్ని సూచిస్తే అల వ్యక్తాన్ని సూచిస్తుంది. సముద్రం నుంచి అలలు అనేక పరిమాణాలు, ఆకారాలు, తీవ్రతలతో కొంత కాలపరిమితి కోసం మాత్రమే వ్యక్తమవుతాయి. చివరికి అలలు అవి పుట్టిన సముద్రంలోనే కలిసిపోతాయి. వ్యక్తమయ్యే అలలను మాత్రమే ఇంద్రియాలు తెలుసుకోగలవు.
అలాగే ఒక విత్తనానికి చెట్టుగా ఎదిగే సామర్థ్యం ఉంటుంది. విత్తనంలో చెట్టు అవ్యక్త రూపంలో ఉంటుంది. అది మొలక రావడం మొదలవగానే వ్యక్తమవడం మొదలు పెడుతుంది. చివరికి అది అనేక విత్తనాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది.
ఇంద్రియాలు తమ పరిమితమైన సామర్థ్యంతో తెలుసుకోగల వాటిని 'వ్యక్తము' అంటాము. ఆధునిక యుగంలో మన ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి కొన్ని సాంకేతిక పరికరాలు కూడా వచ్చాయి. సూక్ష్మదర్శిని/దూరదర్శిని వంటివి కళ్ల యొక్క సామర్థ్యాన్ని పెంచేవి. ఎక్స్ రే పరికరం వివిధ పౌనఃపున్యాల కాంతిలో వస్తువులను చూసేందుకు కంటికి సహకరిస్తుంది.
“ఇది” (ఆత్మ) అనూహ్యమైనదని శ్రీకృష్ణుడు అంటారు. అంటే సాంకేతిక పరికరాల సహాయంతో అయినా మన ఇంద్రియాలు దాన్ని తెలుసుకో లేవు. మెదడు అనేక ఇంద్రియాల సమ్మేళనమే కనుక దానికి అవ్యక్తాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు.
మన అందరి లాగానే అర్జునుడు తనను తాను భౌతిక దేహంతో గుర్తించుకుంటాడు ఎందుకంటే అతనికి అంతకుమించిన అనుభవము, ఆలోచన అవగాహన లేవు.
అవ్యక్తాన్ని గురించిన జ్ఞానోదయం కలిగించి తద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడి ఆలోచనల్లో ఆదర్శమైన మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. అర్జునుడి వంటి మేధావికి ఇది అర్థం చేసుకోవడానికి స్వయానా భగవానుడి అవసరం వచ్చింది. ఇక మనం దీనికి అతీతులం కాదు.
0 notes
22. సంతులనమే పరమానందం
విజయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుగుచున్నవని భగవద్గీత ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు చెబుతారు (2.14). అవి అనిత్యములు కనుక వాటిని సహింపమని ఆయన అర్జునుడికి చెబుతారు. సమకాలీన సమాజంలో దీనిని 'ఇది కూడా దాటిపోతుంది' అని వ్యక్తీకరిస్తారు. అనుభవాత్మకమైన స్థాయిలో మనం దీనిని అలవర్చుకోగలిగితే ఈ ద్వంద్వాలను అధిగమించి వాటిని సమానంగా చూడడం అలవర్చుకుంటాము.
మనకు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అనే ఐదు ఇంద్రియానుభూతులు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే భౌతిక సాధనాలు కళ్ళు, చెవులు, ముక్కు నాలుక, చర్మం. సంబంధిత అవయవాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించడానికి మెదడులో కూడా ఒకో ఇంద్రియానికి ఒకో ఒక భాగం ఉంటుంది.
ఇంద్రియ సాధ నాలకి అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకి కన్ను - ఇది ఒక రకమైన పౌనఃపుణ్యం గల కాంతిని మాత్రమే క్రమబద్ధం చేయగలదు. దీన్నే మనం దృశ్యమాన కాంతి (విజిబుల్ లైట్) అంటాము. రెండవది అదీ సెకనుకి 15 బొమ్మల కంటే గుర్తించలేదు. తెరపై చూసినప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చే వీడియోలు, సినిమాల సృష్టి వెనక ఉన్న సూత్రం ఇదే. మూడవది, దేన్నైనా చూడడానికి కనీసం కొంత కాంతైనా కావాలి. ఇంద్రియాలకున్న ఈ పరిమితులు, 'సత్' (శాశ్వతం), 'అసత్' (అశాశ్వతం) ల మధ్య ఉన్న తేడాను గమనించే మన సామర్థ్యానికి అడ్డుపడి మనం తాడుని చూసి చుట్టుకున్న పామని భ్రమ పడేలా చేస్తాయి.
ఈ భౌతిక పరికరాల యొక్క మెదడులోని భాగాలు కూడా, ఈ పరికరాల కున్న పరిమితులవల్ల వైకల్యానికి గురవుతాయి. ప్రత్యేకించి, మన బాల్యంలో పెంపకం ద్వారా మనకు నేర్పబడ్డ అంశాల వలన మెదడులోని కొన్ని కణాలైన న్యూరాన్లు ఒక ప్రత్యేక నిర్మాణంలో ఇమడ్చబడతాయి, దీనినే హార్డ్ వైరింగ్ అంటారు. ఇది ప్రేరేపించబడ్డ అవగాహనను కలిగిస్తుంది. అంటే మనం దేన్ని చూడాలనుకుంటామో, దాన్నే చూసేలా చేస్తుంది. 'సత్' ను చూడలేని ఈ అసమర్ధత, 'అసత్' వైపుగా ఒరిగే స్వభావం దుఃఖానికి కారణమవుతుంది.
సుఖం, దుఃఖం వంటి ధృవాలు దాడి చేసినప్పుడు మనం సంతులనంతో ఉండగలిగితే ఇక్కడే, ఇప్పుడే అమృతానికి (మోక్షానికి) అర్హత సంపాదించుకుంటామని శ్రీకృష్ణుడు (2.15) అభయమిస్తున్నారు.
0 notes
21. సృజనాత్మకతను నాశనము చేయలేము
అంతరాత్మను అర్థం చేసుకునే తృష్ణతో ఉన్న మానవాళికి రెండు రకాల జ్ఞానులు మార్గదర్శకత్వం చేశారు. రెండు మార్గాల గమ్యం ఒకటిగానే ఉన్నప్పటికీ ఒకరు సానుకూల పక్షం నుంచి, మరొకరు ప్రతికూల పక్షం నుంచి ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రయాణం ఆరంభించే స్థలంలోనే తేడా ఉంటుంది. ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది మన స్వభావం పై ఆధారపడి ఉంటుంది.
సానుకూల దృక్పథంతో సాగే మార్గదర్శనము నాశనము లేనిది, శాశ్వతమైనది, స్థిరమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అయిన 'దాన్ని', దానికి 'ఇంకేమి కలపలేని' దానిగా వర్ణిస్తుంది. 'సృజనాత్మకత' దీనికి రూపకం.
ప్రతికూల దృక్పధంతో సాగే మార్గదర్శనం నాశనం చేయలేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించబడినది అయిన 'దాన్ని', దాని నుండి 'ఇంకేమి తీయలేని' దానిగ వర్ణిస్తుంది. 'శూన్యం' దీనికి ఒక రూపకం.
'సృజనాత్మకత', 'శూన్యం' అనేవి రెండూ సృష్టి/భౌతిక వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 'సృజనాత్మకత' సృష్టికి దారితీస్తుందని అంతర్లీనంగా అర్థం చేసుకోవడం సులభం.
మరొకవైపు విజ్ఞాన శాస్త్రం ఈ సమస్త సృష్టి 'శూన్యం' నుంచి పుట్టిందనీ, విశ్వాన్ని ఉనికిలోకి తీసుకురాగలిగిన శక్తి శూన్యానికి ఉందని నిర్ధారణకు వచ్చింది. చిన్న పరమాణువు నుంచి శక్తివంతమైన విశ్వం దాకా శూన్యం అన్నిటా వ్యాపించి ఉంటుంది.
శ్రీకృష్ణుడు తరచుగా ఉల్లేఖించిన శ్లోకంలో (2.23) ఇలా అంటారు. “ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు; అగ్ని దహింప జాలదు; నీరు తడపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.”
'శూన్యాన్ని' గాని 'సృజనాత్మకత'ను కానీ ఏదైనా ఆయుధం నాశనం చేయగలదా? ఖచ్చితంగా చేయలేదు. మహా అయితే 'సృజనాత్మకత' యొక్క భౌతిక వ్యక్తీకరణను మార్చుకోగలుగుతుంది అలాగే అగ్ని సృజనను కానీ, శూన్యాన్ని కానీ నాశనం చేయలేదు. దాని సామర్థ్యం శక్తి కట్టెను బూడిదగా మార్చడం వరకే పరిమితం; ఈ రెండు భౌతిక స్వరూపాలే. నీరు కూడా సృజనను లేక శూన్యాన్ని కరిగించలేదు. అలాగే గాలికి కూడా వీటిని ఆరిపోవునట్లు చేసే నైపుణ్యాలు గాని, శక్తి గానీ లేదు.
సృజనాత్మకత సృష్టిని ఉనికిలోకి తెస్తుంది. కానీ సృష్టికి సృజనను ప్రభావితం చేసే శక్తి లేదు. ఇక్కడ దిశ ముఖ్యమైనది. ఆకాశంలో మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ అవి ఆకాశాన్ని ప్రభావితం చేయలేవు.
0 notes
20. మరణం మనల్ని చంపలేదు
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తారు “నీవు గాని, నేను గాని ఈ రాజులు గానీ ఉండని కాలమే లేదు. ఇకముందు కూడా మనము ఉండము అన్న మాటే లేదు” (2.12).
నాశనంలేని శాశ్వతమైన 'జీవన అస్తిత్వం' యొక్క 'లౌకిక భాగం' నశించడం ఖాయమని అందువల్ల ముందున్న యుద్ధాన్ని కొనసాగించవలసినదని ఆయన అన్నారు. శాశ్వతమైన 'జీవన అస్తిత్వాన్ని' ఆత్మ, చైతన్యం, అవగాహన అన్న పేర్లతో పిలుస్తాము. శ్రీకృష్ణుడు దీనినే 'దేహి' అంటారు.
శ్రీకృష్ణుడు ఈ సృష్టి యొక్క సారంతో మొదలు పెట్టి శాశ్వతమైన, అపరిమితమైన 'జీవన అస్తిత్వం ' గురించి మాట్లాడతారు. ఇదే శాశ్వతమైన అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉంది. అది తప్పని సరిగా నాశనం అవుతుందని అంటారు. శ్రీకృష్ణుడు పాలకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన వారిలోని ఉన్న శాశ్వతమైన నాశనము లేని 'జీవన అస్తిత్వం' గురించి ప్రస్తావిస్తున్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, మనందరమూ రెండు భాగాలతో నిర్మించబడ్డాము. మొదటి భాగము దేహము, మనస్సు - ఈ రెండూ తప్పని సరిగా నాశనమయ్యేవి. ఇవి సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు లోనవుతాయి; అర్జునుడు అటువంటి భావనకే లోనవుతున్నాడు.
రెండవ భాగము శాశ్వతమైన 'దేహి'. దీనిని గ్రహించి మనల్ని శరీరం, మనస్సు (అసత్)తో గుర్తించడం మానేసి దేహి (సత్) తో గుర్తించడం ప్రారంభించాలని కృష్ణుడి ఉద్ఘాటన. బుద్ధత్వం (ఆత్మజ్ఞానం) అనేది ఈ గుర్తింపులను అధిగమించినప్పుడే కలుగుతుంది. దీని అనుభూతి చెందాల్సిందే గానీ మాటల్లో వర్ణించలేము.
యుద్ధం చేయాలని అర్జునుడిని శ్రీకృష్ణుడు చెప్పే భాగమే భగవద్గీతలో మన అవగాహనకు అత్యంత క్లిష్టమైన భాగం. కొంతమంది అసలు కురుక్షేత్ర యుద్ధమే జరగలేదని అది మన దైనందిన పోరాటాలకు రూపకం మాత్రమేనని అంటారు. అర్జునుడు దాని నుండి విరమించడం ద్వారా యుద్ధం ముగిసే అవకాశం లేదనేది కూడా నిజం.
శ్రీకృష్ణుడు అవగాహన, బోధన అనే ఆయుధాలతో యుద్ధాలను ఎదుర్కోవాలని బోధిస్తున్నారు. అహంకారం (అహం-కర్త) తో అర్జునుడు యుద్ధం నుండి వైదొలగినప్పటికి విషాదానికి శాశ్వతంగా బానిస అవుతాడని కృష్ణుడికి తెలుసు. అందుచేత శ్రీకృష్ణుడు 'సత్'ను గ్రహించి యుద్ధం చేయమని సలహా ఇస్తారు.
0 notes
19. సృజనాత్మకత సృష్టిస్తుంది
'సత్' (వాస్తవమైనది/శాశ్వతమైనది) మరియు 'అసత్' (అవాస్తవం/అశాశ్వతం) గురించి మరింతగా వివరిస్తూ శ్రీకృష్ణుడు నాశనం లేనిది, అన్నింటా వ్యాపించి ఉన్న 'దాన్ని' గురించి మనలను ఆలోచించమంటారు (2.17).
ఈ సృష్టి యావత్తు సృష్టికర్త పని అనే సులభమైన అవగాహన కల్గివుండటం చాలా సహజం. కానీ శ్రీకృష్ణుడు స్థిరమైన పరిణామ శక్తి అయిన 'సృజనాత్మకత' దిశగా దృష్టి మల్లించాలని సూచిస్తారు. ఉదాహరణకు 'సృజనాత్మకత' విత్తనాలను మొలకెత్తేలా చేస్తుంది. మొలకను, విత్తనాన్ని (రెండు సృష్టులను) నాశనం చేయొచ్చు, కానీ నిరంతరం పని చేస్తూ ఉండేది, సర్వత్రా వ్యాపించి ఉన్న 'సృజనాత్మకత' మాత్రం నాశనము చేయబడదు. సృష్టికి కాలపరిమితి ఉంటుంది కానీ 'సృజనాత్మకత' కాలాతీతమైనది. సృష్టి పుడుతుంది. మరణం తర్వాత ఉనికిని కోల్పోతుంది. కానీ 'సృజనాత్మకత' నాశనం లేనిది.
'సృజనాత్మకత' అనేదే సృష్టించే క్రమంలో నిజమైన కర్త. ఇది భావనలను, ఉద్వేగాలను సృష్టిస్తుంది. మన దేహం, మనస్సు వంటి భౌతిక స్వరూపాలను సృష్టిస్తుంది.
జ్ఞానము, జ్ఞాపకశక్తి అనేవి గతానికి సంబంధించినవి, కానీ సృష్టి (కర్మఫలము) అనేది భవిష్యత్తు లోనిది. 'సృజనాత్మకత' ఎల్లప్పుడూ వర్తమానం లో జరుగుతుంది.
'సృజనాత్మకత' అనేది మేధస్సును, జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇంద్రియాల ద్వారా ఆహ్లాదకరమైన, బాధాకరమైన అనుభూతులను గ్రహించి వాటికి అతీతంగా స్పందించే సామర్థ్యం. మన ఇంద్రియాలకు సృష్టి యొక్క అనుభూతిని పొందే సామర్థ్యం మాత్రమే ఉంది. వాటిని అధిగమిస్తేనే 'సృజనాత్మకత' ను తెలుసుకో గలుగుతాము.
మనం 'సృజనాత్మకత' తో మనల్ని మమేకం చేసుకోగలిగి నప్పుడే మన వ్యక్తిగత జీవితంలో కానీ, వృత్తిపరమైన జీవనంలో కానీ ఆనందానికి ఉత్తమమైన క్షణం. ఒక కర్మ యోగికి ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించటం ద్వారా ఈ స్థితిని పొందడం చాలా సులభం.
సృజనాత్మకతే మన సహజ స్వభావం. కానీ మనం సృష్టితో గుర్తించబడడానికి ఇష్టపడతాము. ఈ విధంగా మనం తప్పుడు గుర్తింపు కలిగి ఉండటం మూలానే మనము కర్తలమన్న భావనకు లోనవుతాము. అహంకారానికి అదే మూలము.
'సృజనాత్మకత' తో మనల్ని మనం గుర్తించుకున్న క్షణం మన చుట్టూ ఉన్న సృజనను చూడవచ్చు. ఇలా చేయాలంటే శ్రీకృష్ణుడు మనల్ని ఇతరులలో, ఇతరుల్ని మనలో, చివరికి తనను అన్నిటా అంతటా చూడాలని ప్రబోధిస్తున్నారు.
1 note
·
View note
18. సత్యము, అసత్యము
'సత్' (వాస్తవమైనది/ శాశ్వతమైనది) నశించదని, 'అసత్' (అవాస్తవమైనది/అశాశ్వతమైనది) కు ఎన్నడూ ఉనికి లేదని, శ్రీకృష్ణుడు చెబుతారు. జ్ఞాని మాత్రమే ఈ రెండింటి మధ్య తేడాని గమనించగలరు (2.16).
'సత్', 'అసత్' యొక్క చిక్కుముడులను అర్థం చేసుకోవడానికి అనేక సంస్కృతులలో తాడు, పాముల యొక్క భ్రాంతికి సంబంధించిన కథ ఉదహరించబడుతుంది. సంధ్యవేళ ఒక మనిషి ఇంటికి చేరుకొని, గుమ్మంలో ఒక పాము లాగా చుట్టుకుని ఉన్న వస్తువును చూస్తాడు. నిజానికి అది పిల్లలు వదిలివేసిన తాడు; మసకగా ఉండడం వల్ల పాములా కనిపించింది. ఇక్కడ తాడు 'సత్' ను, పాము 'అసత్' ను సూచిస్తుంది. అతడు 'సత్' ను అంటే తాడును గుర్తించే వరకూ తాను ఊహించుకున్న 'అసత్' అంటే పాముని ఎదుర్కోడానికి అనేక వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంది. అతడు దానిపై కర్రతో దాడి చేస్తాడు లేక పారిపోతాడు లేదా నిజాన్ని తెలుసుకోవడానికి ఒక దీపాన్ని/టార్చ్ ను వెలిగిస్తాడు. మన అవగాహన అవాస్తవం మీద ఆధారపడినప్పుడు అత్యుత్తమమైన వ్యూహాలు, నైపుణ్యాలు కూడా నిష్ఫలం అవుతాయి.
ఇక్కడ 'తాడు' లేకుండా 'పాము' అనే భావనకు అవకాశం లేదు అంటే వాస్తవం నుంచి అవాస్తవం తన ఉనికిని పొందుతుంది. అందువల్లనే పీడకల వచ్చినప్పుడు మన శరీరానికి నిద్రలో చెమట పట్టినట్లు అవాస్తవమైన కల కూడా మనల్ని ప్రభావితం చేయగలదు.
ఏదైతే గతంలో లేదో భవిష్యత్తులో కూడా ఉండదో అదే 'అసత్' అని శ్రీకృష్ణుడు సూచించారు. ఇంద్రియాల ద్వారా మనము కలిగే సుఖాన్ని ఉదాహరణగా తీసుకుంటే, అది అంతకు ముందు లేదు; కాసేపటి తర్వాత ఉండదు. బాధ విషయంలో కూడా అంతే; ఆ మాటకొస్తే అన్ని ద్వంద్వాల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. 'అసత్' ఒక కాలపరిమితి వరకే ఉంటుందని, 'సత్' శాశ్వతమైనదని మనం గుర్తించాలి.
'సత్' అనేది శాశ్వతమైన మన అంతరాత్మ, 'అసత్' అనేది మన అహంకారం. అది అంతరాత్మ మద్దతుతో తనను తాను నిలబెట్టుకుంటుంది. మన అంతరాత్మను (తాడును) మనం గుర్తించినప్పుడు, అహంకారం (పాము) దానికదే మాయమవుతుంది.
0 notes
17. నాలుగు రకాల భక్తులు
శ్రీకృష్ణుడు నాలుగు రకాల భక్తులు ఉంటారని అంటారు.
మొదటిరకం వారు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు, దుఃఖం నుంచి బయటపడాలని కోరుకుంటారు.
రెండవవారు భౌతిక ఆస్తులు, ప్రాపంచిక సుఖాలని కోరుకుంటారు. చాలా మంది భక్తులు ఈ రెండు వర్గాలకు చెందుతారు.
ఈ రెండు రకాల భక్తులూ అనేక దేవతలను ప్రార్ధిస్తూ అనేక రకాల పూజలు, ప్రార్ధనలను చేస్తూ ఉంటారని శ్రీకృష్ణుడు చెప్తారు. ఉన్న రోగాన్ని బట్టి సంబంధిత వైద్యుడిని సంప్రదించడం వంటిదే ఇది. వీరికి ఉన్న శ్రద్ధ వల్ల ఇటువంటి భక్తుల కోరికలు తీరతాయని శ్రీకృష్ణుడు అంటారు. ఇది సంక్షిప్తంగా ఒక రకమైన శరణాగతి.
దిగువ ఉదాహరణ శ్రద్ధను గురించి చెబుతుంది.
ప్రక్క ప్రక్కన పొలాలు ఉన్న ఇద్దరు రైతులు, సాగు కోసం ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకుంటారు. మొదటి రైతు ఒకటి రెండు రోజులు ఒక చోట తవ్వి నీరు పడకపోవడంతో మరొక ప్రదేశంలో కొత్తగా తవ్వడం మొదలు పెడతాడు. రెండవ రైతు విడవకుండా ఒకే ప్రదేశంలో తవ్వుతూ పోతాడు. ఒక నెల గడిచేసరికి మొదటి రైతు పొలమంతా గోతులతో నిండిపోయింది. రెండవ రైతు తన బావిలో నీటిని పొందుతాడు. మన ఇంద్రియాలకు ఏమీ కనిపించకపోయినా (ఈ ఉదాహరణలో నీరు),మనల్ని నడిపించేది మనలో ఉన్న శ్రద్ధ. శ్రద్ధ నిర్భయమైన సానుకూల శక్తి; రెండో రైతు ఇది సందేహాలకు తావులేని స్థితి.
ఫలితాలనిచ్చే శ్రద్ధ వెనుక తానుంటానని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. అందువలనే మన అనుబంధాల్లో, కుటుంబంలో, వృత్తిలో మనం చూపే శ్రద్ధకు అద్భుతాలు చేసే శక్తి ఉంది.
మూడో రకం భక్తుడు ఈ కోరికలు అనే ఎల్లలను దాటబోతూ ఉంటాడు. అతను ఉత్సుకతతో కూడి ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటాడు. నాలుగో రకం వారు జ్ఞాని. ఆయన కోరికలనే హద్దులను అధిగమించి ఉంటారు. ఆయన అన్నిటా, అంతటా సర్వశక్తిమంతుడైన భగవంతుడినే చూస్తూ భగవంతునితో ఏకత్వాన్ని పొంది ఉంటారు.
0 notes
16. గుణాతీతులవడం
ఏ కర్మకూ కర్త ఉండడని శ్రీకృష్ణుడు అంటారు. నిజానికి కర్మ అనేది ప్రకృతిలోని భాగాలైన సత్వ, రజో, తమో గుణాల మధ్య జరిగే పరస్పర ప్రభావాల పరిణామమే.
దుఃఖాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గుణాలను అధిగమించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తారు. గుణాతీతునిగా ఉండడం (గుణాలను అధిగమించడం) ఎలాగో, అటువంటి దశను పొందిన వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలని అర్జునుడు ఆశిస్తాడు.
మనం ఇప్పటికే దంద్వాతీత (ధృవాలను అధిగమించడం), ద్రష్ట (సాక్షి), సమత్వ (సమానత్వం) అనే భగవద్గీతలో నిక్షిప్తమైన లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఈ మూడింటి సంయోగమే గుణాతీత అని శ్రీకృష్ణుడు సూచించారు.
శ్రీకృష్ణుడి ప్రకారం గుణాతీత స్థితిని చేరుకున్న వ్యక్తి గుణాలే గుణాలతో ప్రతిస్పందిస్తున్నాయని తెలుసుకుంటాడు కనుక సాక్షిగా ఉంటాడు. అటువంటి స్థితిలో ఒక గుణం పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండడు. మరో గుణం పట్ల విముఖత చూపడు.
గుణాతీతుడైన వ్యక్తి అదే సమయంలో ద్వంద్వాతీతుడు కూడానూ. కష్టసుఖాల యొక్క ధృవాలను అర్థం చేసుకున్నాక అతను రెండిటి పట్ల తటస్థంగా ఉండిపోతాడు. పొగడ్తలకు, విమర్శలకు తటస్థంగా ఉంటాడు. ఎందుకంటే ఇవి త్రిగుణాల యొక్క ఉత్పన్నాలని అతను గుర్తిస్తాడు. అలాగే అతడు మిత్రుల పట్ల, శత్రువుల పట్ల తటస్థంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి మనకు మనమే మిత్రులమని మనకు మనమే శత్రువులమనీ తెలుసు కనుక.
భౌతిక జగతిలో ధ్రువాలు ఉంటాయి కనుక రెండు వైపులా ఊగిసలాడడం సహజం. నిజానికి ఊగిసలాడే లోలకానికి, ఉయ్యాలకు కూడా ఒక స్థిరమైన బిందువు కావాలి. ధృవాల వద్ద ఊగిసలాటలో పాల్గొనకుండా, కేవలం సాక్షిగా నిలబడి చూసే అవకాశమున్నటువంటి స్థిర బిందువును చేరుకోమని శ్రీకృష్ణ భగవానుడు సూచిస్తున్నారు.
గుణాతీతుడు మట్టికి, బంగారానికి ఒకే విలువను ఇస్తాడు. అంటే ఒక దానికి ఎక్కువ విలువ మరొక దానికి తక్కువ విలువ అన్న వ్యత్యాసాన్ని చూపడు. ఇతరులు ఇచ్చే విలువ మీద ఆధారపడక, వస్తువులను వస్తువులుగా చూస్తాడు.
'గుణాతీత' అంటే కర్తృత్వ భావనను విడనాడడమని శ్రీకృష్ణుడు అంటున్నారు. విషయాలు వాటంతటవే జరుగుతాయని ఇందులో కర్తకు ఏమాత్రం స్థానం లేదని అనుభవపూర్వకంగా మనం గుర్తించినప్పుడు ఇది సాధ్యం అవుతుంది.
0 notes
15. సమత్వం
సమత్వం (సమానత్వం ) అనేది భగవద్గీతలో అనేకచోట్ల కనిపించే కీలకమైన అంశం. కృష్ణ భగవానుడు సమత్వ భావనను, సమత్వదృష్టిని, సమత్వ బుద్ధిని అనేక చోట్ల ప్రస్తావిస్తారు. సమత్వాన్ని అర్థం చేసుకోవడం సులభం కానీ అంతర్లీనము చేసికొని ఆచరణలో పెట్టడం అనేది కష్టమైన విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే మనలోని సమత్వం యొక్క స్థాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం సాధించే పురోగతికి సూచిక.
ఆధునిక సమాజాలు, పౌరులందరూ చట్టం ముందు సమానమే అని సమత్వాన్ని అంగీకరించాయి. జ్ఞాని వేటను వేటగాడిని; బాధని సంతోషాన్ని; లాభాన్ని నష్టాన్ని సమానంగా చూస్తాడంటూ శ్రీకృష్ణుడు సమత్వానికి అనేక ఉదాహరణలు ఇస్తారు.
మన పెంపకం వలన, సమాజం వలన ధర్మం, కులము, మతము, జాతి, వర్గం వంటి అనేక కృత్రిమమైన విభజనలకు మనం లోనవుతాము. ఈ విభజనలన్నింటినీ అధిగమించి ఇద్దరు మనుషుల్ని సమానంగా చూడడమే సమత్వం వైపు తొలి అడుగు. ఇది బాహ్య ప్రవర్తన కన్నా చాలా లోతైనది.
సమత్వం వైపు పురోగతిలో తదుపరి స్థాయి మనంత దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సమత్వ దృష్టి/భావంతో చూడడం. ఇందుకు ఉదాహరణలు మన పిల్లలు అంతగా రాణించని సందర్భాల్లో మన మిత్రుల పిల్లలు రాణిస్తూ ఉంటే సంతోషించగలగటం, అత్తను అమ్మను సమానంగా చూడడం, కూతురిని కోడల్ని సమానంగా చూడడం వంటివి.
ఇతరులను మనతో సమానంగా చూసే సామర్థ్యం సమత్వము యొక్క పతాక స్థాయి. మనకు దక్కాల్సిన పదోన్నతి, కీర్తి, ప్రతిష్ట, ఆస్తులు, ఇతరులకు దక్కినప్పుడు సమత్వ భావంతో వ్యవహరించగల సామర్ధ్యమిది. ఇతరుల బలహీనతల్ని మనలో, మన సామర్థ్యాలను ఇతరుల్లో చూడగలిగినుప్పుడే ఇది సాధ్యపడుతుంది.
శ్రీకృష్ణుడు మనల్ని ఇతరుల్లో, ఇతరుల్ని మనలో చూడమని సలహా ఇస్తారు. చివరికి కృష్ణుడిని అందరిలోనూ, అన్నింటిలోనూ చూడమంటారు. ఇది రెండూ లేవని చెప్పే అద్వైతమే.
విభజనకు శిక్షణ ఇవ్వబడిన మనమనస్సే అత్యున్నత స్థాయి సమత్వాన్ని పొందడానికి అతిపెద్ద అవరోధం. మనపై అది ఆధిపత్యం చెలాయించేందుకు అనుమతించే బదులు మనం మనస్సును లొంగదీసు కోగలగాలి.
0 notes
14. సత్వ, తమో, రజో గుణాలు
మనలో చాలామందిమి మన చర్యలన్నిటికీ మనమే కారణం అని మన విధిని మనమే నిర్ణయిస్తామని నమ్ముతాము. భగవద్గీతలో కృష్ణభగవానుడు గుణాల మధ్య ప్రతిస్పందనలే కర్మను సృష్టిస్తాయని అంతేగానీ కర్త వల్ల కాదని బోధిస్తున్నారు. ప్రకృతి నుంచి మూడు గుణాలు పుట్టి ఆత్మను భౌతిక దేహంతో బంధిస్తాయి. ఈ సత్వ, రజో, తమో గుణాలు మనలోని ప్రతి ఒక్కరిలో వివిధ పాళ్లలో ఉంటాయి. సత్వగుణం జ్ఞానంతో, రజోగుణం కర్మలతో, తమోగుణం అలసత్వంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
కేవలం 'ఎలక్ట్రాన్లు', 'ప్రోటాన్లు', 'న్యూట్రాన్ల' ల కలయిక వలన ��ిస్తృతమైన లక్షణాలు గల అనేక వస్తువులు ఉత్పన్నమైనట్లే ఈ మూడు గుణాలు యొక్క కలయికే మన స్వభావానికి, కర్మలకు కారణం. నిజానికి, వ్యక్తుల మధ్య జరిగే సంప్రదింపులు వారి యొక్క గుణాలు మధ్య జరిగే సంప్రదింపులే తప్ప మరేమీ కాదు.
విద్యుదయస్కాంత క్షేత్రంలో ఉంచిన అయస్కాంత ద్విధృవం (dipole) ఆ క్షేత్రం వెంటే తిరుగుతుంది. వస్తువులు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షింపబడతాయి. ఇటువంటి అనేక భౌతిక రసాయనిక లక్షణాలు ఉన్నాయి. అలాగే కర్మ కూడా కర్త వల్ల కాక గుణాల యొక్క కలయిక వల్ల జరుగుతుంది. భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ అంతర్నిర్మిత స్వయంచాలకత గురించి శ్రీకృష్ణుడు మనకు అవగాహన కలిగిస్తున్నారు.
ఉదాహరణకి మన స్వంత దేహం కూడా తనంతట తానే (స్వయంచాలకంగా) పని చేస్తుంది. గుణకర్మల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఈ ఉదాహరణలు సహాయం చేస్తాయి. మన జీవిత అనుభవాల సహాయంతో ఈ సత్యాన్ని గుర్తిస్తే మనలో మార్పు సాధించ గలుగుతాము.
ఆత్మజ్ఞానం పొందే దారిలో ప్రధానమైన అవరోధం అహంకారం. మన పెంపకంలోని నియంత్రణ మనమే కర్తలమని భావించుకునేలా చేసి అహంకారానికి పునాదులు వేస్తుంది. కాని వాస్తవానికి ఈ మూడు గుణాలు మధ్య పరస్పర కలయికలే కర్మను సృష్టిస్తాయి.
ఈ సత్యాన్ని అవగాహన చేసుకుని, మనల్ని మనం మెరుగు పరచుకోవడమనే బాధ్యత మన భుజాల పైనే ఉంటుందని, ఇది జరిగేలా ఇంకెవరూ చేయలేరనీ శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు.
0 notes
13. సాక్షిగా నిలవడం
మొత్తం భగవద్గీతని ఒక్క పదంలో చెప్పాలంటే 'ద్రష్ట' (సాక్షి) గా చెప్పవచ్చు, ఇది అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. మనలో చాలామంది మనమే అన్నీ చేస్తామని, పరిస్థితులను నియంత్రిస్తామని అనుకుంటూ ఉంటాము కనుక నిజాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి 60 ఏళ్ల వయసు. అప్పటికే అతడు మంచి జీవితాన్ని గడిపి అన్ని విలాసాలను అనుభవించాడు. ఒక యోధుడిగా అతడు యుద్ధ క్షేత్రంలో అనేకసార్లు విజయాన్ని చవి చూశాడు. యుద్ధ సమయంలో అతడు తానే కర్తనని (అహం కర్త - అహంకారం), తన బంధుమిత్రుల చావుకు తానే బాధ్యుడనని భావించడం వలన యుద్ధ క్షేత్రంలో అతడు విషాదానికి లోనయ్యాడు. అతడు 'కర్త' కాదని, కృష్ణ భగవానుడు అతనితో చెప్పే ప్రయత్నమే భగవద్గీత ! సహజంగా తర్వాతి ప్రశ్న. 'ఒకవేళ నేను కర్తను కాకపోతే మరి ఏమిటి?' భగవానుడు భగవద్గీతలో అర్జునుడితో నీవు 'ద్రష్ట' అంటే సాక్షివని చెబుతారు.
60 ఏళ్ల జీవితంలోని మంచి, చెడు అనుభవాల వల్ల అర్జునుడు తాను కేవలం ఒక 'సాక్షి' ని మాత్రమే కానీ 'కర్త' ను కాదు అన్న భావనను జీర్ణించుకోలేకపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రమ కోర్చి చేసిన వివరణ అర్జునుడికి ఈ నిజాన్ని గ్రహింప చేస్తుంది. చాలా సంస్కృతులు మనం కేవలం 'ద్రష్ట' లము మాత్రమేనని చెప్పినా కూడా, ఆధ్యాత్మిక ప్రయాణపు ఆరంభ దశలో ఉన్న వాళ్ళు ఈ భావనను అర్ధం చేసుకోలేక గందరగోళానికి గురవుతారు.
ద్రష్ట (సాక్షి) అనేది ఒక జ్ఞాన స్థితి; భౌతిక ప్రపంచంలో వ్యక్తీకరించబడేది కాదు. రోజువారీ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, పరిణామాల నుండి ఓ అడుగు వెనక్కు వేసి అంతర్గత స్థిరత్వాన్ని కలిగి ఉండే సామర్ధ్యమే ఈ సాక్షి భావం. సుఖదుఃఖాలు అందించే గుణం వస్తువుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి నిర్దిష్ట ఫలితాన్ని ఆశించకుండా పని చేయడానికి సిద్ధపడటమే సాక్షిభావం. ఇది మన భావనలను సాక్షిగా గమనించుకుంటూ వాటిని అధీనంలో ఉంచుకునే సామర్ధ్యమే.
0 notes
12. మనసును నియంత్రించడం
అర్జునుడు మనసును గాలితో పోలుస్తూ, సంతులనాన్ని పొందేందుకు దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలని ఆశిస్తాడు. శ్రీకృష్ణుడు అది కష్టమైనదని చెబుతూ, వైరాగ్యాన్ని ఆచరించడం ద్వారా దాన్ని సాధించగలమని బోధిస్తారు.
జ్ఞాపకశక్తిని ఉపయోగించి, ఇంద్రియాలు అందించే సమాచారాన్ని సురక్షితమైనదిగా, సురక్షితం కానిదిగా నిర్ధారించేలా మనస్సుకు శిక్షణ ఇవ్వబడింది. పరిణామక్రమంలో ఈ సామర్ధ్యమే మనం జీవించడానికి, అభివృద్ధి చెందడానికీ ఉపయోగపడింది.
మనసుకున్న ఇదే సామర్థ్యాన్ని అంతరాత్మను చేరడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనినే జాగరూకత అని కూడా అంటారు. మనం ఈ సామర్ధ్యం ద్వారా సొంత ఆలోచనలు, భావనలను తిరిగి మనస్సుకు అందించి దాని నిర్ణయాల యొక్క నాణ్యతను మెరుగు పరుచుకోవచ్చు.
నేటి ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలను స్థిరీకరించ డానికి మెషీన్ లెర్నింగ్ (యాంత్రిక అభ్యాసాన్ని) ను, కంప్యూటర్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఈ విధంగానే 'ఫీడ్ బ్యాక్ లూప్స్' (Feedback loops) ను ఉపయోగిస్తున్నారు. ఇది సహజంగా రాదు కనక, ఆచరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. ఇది మెదడులో కొత్త శక్తిని నింపడం వంటిది.
విభిన్న ధ్రువం అయిన 'రాగం' అర్థం చేసుకోవడం ద్వారా వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. 'రాగం' అంటే భౌతిక ప్రపంచంలో అందం, ఆస్తులు, అభివృద్ధి వంటి ఆనందాల కోసం విస్తృతంగా పాకులాడడం. ద్వంద్వాల యొక్క సూత్రం ప్రకారం ప్రతి 'రాగ భావము/భావన' వైరాగ్యంతో ముగుస్తుంది కానీ మన దృష్టి ఎల్లప్పుడు 'రాగం' పైనే ఉంటుంది. అందుకే వైరాగ్యాన్ని విస్మరిస్తాము.
స్టోయిసిజం వంటి కొన్ని తత్వాలు. వైరాగ్యానికి శిఖరం వంటి మరణం యొక్క ఉపయోగాన్ని సమర్ధిస్తాయి. దీన్ని 'మెమెంటో మోరి' అంటారు అంటే మరణాన్ని మళ్లీ మళ్లీ దర్శించడం లేక అనుభూతి చెందడం. ఈ పద్ధతిలో వారు చావుకి గుర్తుగా (జ్ఞాపకార్ధంగా) పనిచేసేచోటిలో లేక ఇంట్లో ఒక ప్రముఖ స్థానంలో దేన్నైనా ఉంచి, దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ మృత్యువు పైన ధ్యాస నిలబడేలా చూస్తారు. భారతీయ వేదాంతం దీనినే 'స్మశాన వైరాగ్యం' అంటుంది.
మనం వైరాగ్యాన్ని సాధన చేయడం మొదలు పెడితే అది మనసుని స్థిరపడేలా చేస్తుందని, శ్రీకృష్ణుడు అంటారు.
ఈ లాక్ డౌన్ సమయాలు మనకు వైరాగ్య క్షణాలను దర్శింప చేశాయి. వీటిని మనసును సమతుల్యతలో ఉంచడానికి, శాంతి ఆనందాలను పొందడానికి ఉపయోగించుకోవచ్చు.
0 notes
11.దుఃఖం సుఖాన్ని అనుసరిస్తుంది
ద్వంద్వాతీతం అంటే ద్వంద్వాలను/విరుద్ధ భావాలను అది గమించడం. భగవద్గీతలో ఉన్న మరొక అమోముమైన ఉపాయం ఇది. అర్జునుడిని ఈ స్థితికి చేరమని చెబుతూ శ్రీకృష్ణుడు వేర్వేరు సందర్భాలలో అనేక సలహాలను ఇస్తారు.
“సుఖాన్ని పొందడానికి మనం చిత్తశుద్ధితో కష్టపడి పని చేసినా కూడా బాధ/దుఃఖం మనకు ఎలా కలుగుతాయి?” అన్నది మానవాళిని ఉత్కంఠకు గురిచేసే సాధారణ ప్రశ్న. మన లోపలికి చూసే బదులు మన ప్రయత్నాలు సరిపోలేదని మనల్ని మనమే సమాధాన పరచుకుంటాము. కానీ ఆశతో కూడుకున్న అహంకారం సుఖాన్ని పొందడం కోసం తిరిగి మనం ఇదే ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రేరణ కలిగిస్తుంది; ఇలా జీవితం ముగిసే దాకా కొనసాగుతుంది. ద్వంద్వాతీతము అన్న దాన్ని అర్థం చేసుకోవడమే ఈ ప్రశ్నకు సమాధానం.
వ్యక్తమయ్యే ప్రపంచంలో ప్రతిదీ దాని విరుద్ధ ధృవంతో (ద్వంద్వ) పాటే ఉనికిని కలిగి ఉంటుంది. పుట్టుకకు వ్యతిరేక ధృవం చావు; సుఖానికి దుఃఖం, గెలుపుకి ఓటమి; లాభానికి నష్టం; కలయికకు విడిపోవడం; పొగడ్తకు విమర్శ; షరతులతో కూడిన ప్రేమకు ద్వేషం; ఇలా ఈ జాబితా అనంతంగా సాగుతూనే ఉంటుంది.
ఇక్కడ నియమం ఏమిటంటే, మనం వీటిలో ఒక దాని వెంటపడుతూ ఉంటే దాని విరుద్ధ ధృవం దానంతటదే మనల్ని అనుసరిస్తుంది. ఒక కర్రని మనం ఒక వైపు నుంచి ఎత్తినప్పుడు రెండవ కొస కూడా పైకి లేస్తుంది కదా? లోలకాన్ని లేదా ఉయ్యాలను మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది ఒక వైపు వెళితే అనివార్యంగా మరొక వైపు కూడా రావలసిందే.
ఈ ధృవ సిద్ధాంతం ప్రకారం, కోవిడ్-19 వల్ల కలిగిన బాధ కొన్నాళ్ళకు సుఖం వైపు మొగ్గుతుంది. మెరుగైన విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీ ద్వారా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులే మనకు సుఖాన్ని తీసుకురాగలిగాయని చరిత్ర చెబుతోంది. కోవిడ్-19 వంటి విపరీత ధ్రువాలకు అంతరాత్మ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసే సామర్థ్యం ఉంది.
శ్రీకృష్ణుడు మనం ఈ ద్వంద్వాలను అధిగమించాలని చెబుతారు. ఉదాహరణకు వర్తమానంలో జీవించటమే గతాన్ని, భవిష్యత్తును అధిగమించడం; షరతులతో కూడిన ప్రేమను, ద్వేషాన్ని అధిగమించి బేషరతైన ప్రేమను మనలో సాధించడం.
మనకు కావలసిందల్లా ఈ ధృవాలను గురించిన అవగాహనను కలిగి ఉండడం; వాటి మధ్య ఊగుతూ ఉన్నప్పుడు వాటిని గమనించడం. మన జీవించి ఉన్నంత కాలం, ఈ ధృవాలకు లోను కావడం సహజం కాని అవగాహన వీటిని అధిగమించేందుకు మనకు సహాయపడుతుంది.
0 notes
10. మహమ్మారిలో శ్రీకృష్ణుడు
ఆత్మజ్ఞానం పొందే దారిలో మనకు ఎదురయ్యే అనేక అడ్డంకులను దాటడానికి, మూసివున్న ద్వారాలను తెరవడానికి కావలసిన అమోఘమైన తాళంచెవులన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి ఒక కీలకమైన ఉపాయం మిమ్మల్ని ఇతరుల్లో, ఇతరుల్ని మీలో చూసుకోవడం. అందరిలో ఉన్నది తానేనని గుర్తు చేస్తూ, తాను నిరాకారుడినని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు, మనం ఆయనకు సాష్టాంగ పడ్డ విధంగానే ఒక గాడిదకు లేక దొంగకు కూడా సాష్టాంగ ప్రణామం చేసే స్థాయికి ఎదగాలని చెబుతారు.
ఇంద్రియాలు మనకు అందించిన సమాచారం యొక్క ఆధారంగా మన మనస్సు మనము ఎదుర్కొంటున్న పరిస్థితులను, సురక్షితమైనవి/ఆహ్లాదకరమైనవి లేదా హానికరమైనవి/బాధాకరమైనవిగా నిర్ధారిస్తుంది. ఎదురవబోయే ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఇది ఎంతో అవసరం. ఇతర సాంకేతిక పరిజ్ఞానంలాగానే మన మనస్సు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది; అది మన పై పెత్తనం చేయడానికి దాని పరిధుల్ని మీరుతుంది. ఇదే అహంకారానికి జన్మస్థానం.
భగవద్గీతలోని అమోఘమైన ఉపాయాలు, మనస్సుని బానిసగా చేసి ఈ విభజనలను తగ్గిస్తే, కలయిక ఐక్యత కలుగుతాయని చెబుతాయి. మన శరీరం లాంటి ఏదైనా సంక్లిష్ట నిర్మాణం ఇటువంటి ఐక్యత సాధించకుండా మనుగడ సాధించలేదు.
మనం ఇటువంటి కీలకమైన ఉపాయాలను ఉపయోగించి నప్పుడు ఇతరుల పట్ల కరుణను, మన గురించిన అవగాహనను పెంచుకుంటాము. ఏ కారణం చేతనైనా మనకు శత్రువు అయిన ఒకరిని ఎంచుకుని వారిలో భగవంతుని చూడటం మొదలు పెట్టడమే ఈ సూత్రాన్ని అనుభవంలోకి తీసుకు రావడానికి మంచి మార్గం. వారితో అనేక బాధాకరమైన
జ్ఞాపకాలు, భావనలు ముడిపడి ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇది కష్టమైనదే! కానీ క్రమంగా, కాలంతో పాటు ఈ బాధంతా కరిగిపోయి సంతోషానికి దారితీస్తుంది. నిజానికి మనందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురయి ఉంటాయి కానీ అవగాహనతో దీనిని అభ్యాసంలో పెట్టవలసిన అవసరముంది.
అవగాహన (తనను గురించి), కరుణ (ఇతరుల పట్ల) అనేవి అంతరాత్మ అనే ఒడ్డును చేరడానికి భగవద్గీత చెప్పిన మార్గంలో ప్రయాణించే మన పడవకు రెండు తెడ్లు.
ఒకసారి మనం దీన్ని అర్థం చేసుకుంటే, మనం శ్రీకృష్ణుడిని కరోనాలో కూడా చూడగలమా?
0 notes
9. మిత్రుడిని, శత్రువును గుర్తించడం
భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనకు మనము మిత్రులము, మనము మనకు శత్రువులము అంటారు. ఉచ్చుల్లో పడ్డ ఒక కోతి కథ ఈ విషయాన్ని మరింత తేలిగ్గా అర్ధం చేసుకోవటానికి ఉపయోగ పడుతుంది.
సన్నమూతి ఉన్న ఒక కుండ (కూజా)లో కొన్ని శెనగ గుళ్ళు ఉన్నాయి. అందులో కోతి చెయ్యి అతి కష్టం మీద పడుతుంది. కోతి తన చేతిని ఆ కుండ యొక్క మూతిలో అతి కష్టంగా దూర్చి చేతినిండా గింజలను పట్టుకుంది. చేతినిండా గింజలు ఉండడంతో చేతి పరిమాణం పెరిగి కుండ నుంచి బయటకు రాలేక పోతుంది. గుప్పిట నిండా గింజలు పట్టుకుని తన చేతిని బయటకు తీయడానికి కోతి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎవరో దానికోసం ఉచ్చు బిగించారని అది భావిస్తుంది కానీ ఆ ఉచ్చును తనకు తానే ఏర్పరుచుకుందని ఎన్నడూ గుర్తించదు. మనము ఏ విధంగా వివరించినా కూడా ఆ కోతి ఆ గింజలను వదలదు; బదులుగా మనమే దాని గింజలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నామని భావిస్తుంది.
బయటి నుంచి చూస్తే అది కొన్ని గింజలను పడేస్తే గుప్పిట వదులై, దాని చెయ్యి బయటికి వస్తుందని తెలుస్తుంది. మనం అనూహ్య పరిస్థితుల్లోనో, విషమ పరిస్థితుల్లోనో చిక్కుకుని ఉన్నప్పుడు ఈ చిన్న విషయాన్ని గుర్తించడమే ఒక నిజమైన పరీక్ష.
మూసిన గుప్పిట మనకు శత్రువు, తెరిచిన గుప్పిట మనకు స్నేహితుడు. గుప్పిట తెరవాలా, ముయ్యాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. దీన్ని బట్టే మనకు మనం మిత్రుడు లేక శత్రువుగా మారతాము.
జీవితంలో మనం ఇటువంటి ఎన్నో ఉచ్చులను ఎదుర్కొంటాము. ఆ గింజలు మరేమిటో కాదు 'నేను',' నాది', 'నాకు', 'నన్ను' వంటివి; అహంకారం మన చేతిని వాటికి కట్టిపడేస్తుంది. భగవద్గీత ఎన్నో విధాలుగా పదేపదే మనకు చెప్పేది ఏమిటంటే అహంకారాన్ని విడనాడమని! అప్పుడు మనం ఈ ఉచ్చుల నుండి విడివడి పరమ స్వేచ్ఛ అంటే మోక్షం దిశగా పయనిస్తాము.
రణగొణ ధ్వనులతో వేగంగా పరుగులు తీసే ప్రపంచంలో మనం కాస్త నెమ్మదిస్తే, ఈ ఉచ్చులను గుర్తించడం చాలా సులభం. ఇటువంటి సాక్షాత్కారాలను పొందడానికి కోవిడ్-19 మనకు ఇచ్చిన అవకాశమే సరైన సమయం.
0 notes
8. వ్యక్తము, అవ్యక్తము
చుక్కానికి జోడించబడ్డ చిన్న యంత్రం (ట్రిం టాబ్) లోని మార్పు పెద్ద ఓడ యొక్క దిశను మారుస్తుంది. అలాగే, భగవద్గీతను అధ్యయనం చేయాలనే చిన్న తపన మన జీవన మార్గాన్నే గొప్పగా మార్చగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల మనకు అందుబాటులో ఉన్న కాలాన్ని భగవద్గీతలో మునగడానికి ఉపయోగిస్తే మన జీవితంలో పెద్ద మార్పు రావడానికి అవకాశము ఉంది.
భగవద్గీత ప్రాథమిక విద్య (కిండర్ గార్డెన్) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేవారి దాకా ఆత్మజ్ఞానం కోసం చదవదగ్గ శాశ్వతమైన పాఠ్య పుస్తకం. మొదటిసారి చదివినప్పుడు చాలా తక్కువ అంశాలు అర్ధమవుతాయి. కానీ, మనం వ��యక్తము మరియు అవ్యక్తం యొక్క దృష్టి కోణం నుంచి సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఇంద్రియాల పరిధిలోకి వచ్చేవి వ్యక్తమైనవి; ఇంద్రియాలకు అతీతమైనవి అవ్యక్తమైనవి.
వ్యక్తమయ్యే వాటి కథ బిగ్ బాంగ్ (బృహత్ ప్రళయం) మొదలు నక్షత్రాల పుట్టుక, ఈ నక్షత్రాల్లోని కీలకమైన భాగాల్లో అత్యున్నత రసాయనిక మూలకాలు కలిగిన అణువుల నిర్మాణం, నక్షత్రాలు విచ్ఛిత్తికి గురైనప్పుడు ఈ మూలకాలు చెల్లాచెదురవుతున్న తీరు, గ్రహ మండలం ఏర్పాటు, భూమ్మీద బౌద్ధిక జీవితం ఆరంభం వంటి అనేక అంశాలను వివరిస్తాయి. ఈ వ్యక్తమైన జీవ రూపాలు, గ్రహాలు, నక్షత్రాలు, చివరికి ఈ విశ్వం కూడా ఒక నిర్దిష్టమైన కాల పరిమితిని కలిగి ఉన్నాయి అని శాస్త్రీయ సమాజం అంగీకరించిన వాస్తవం. కానీ అంచనా వేసిన కాల పరిమితుల్లో తేడా రావచ్చు.
వ్యక్తమయ్యే వాటి దృక్కోణంలో మనం పుట్టినప్పటి నుండీ చనిపోయే దాకా మనుగడ కలిగి ఉంటామన్నది వాస్తవం. అవ్యక్తమైన వాటి దృక్కోణంలో చూసినట్లయితే, భగవద్గీత చెప్పే ప్రకారం మనం పుట్టుకకు ముందు, చావు తరువాత కూడా మనుగడ కలిగి ఉంటాము. మన మనసులో ఈ స్పష్టతను దృష్టిలో పెట్టుకుంటే, భగవద్గీతలో వివరించినట్లుగా మనం వ్యక్తము అవ్యక్తముల యొక్క అనుబంధాన్ని సులభంగా అర్థం చేసుకుని, అవ్యక్తమైన లక్ష్యాన్ని (మోక్షాన్ని) గుర్తించి, పొందగలుగుతాము.
అహంకారమే ఈ మార్గంలో ప్రయాణానికి అవరోధంగా ఉంటుంది. అయితే, బయటి ప్రపంచంలో సుఖదుఃఖాలకు అతీతంగా, మనలో ఎంత ఆనందం నిండి ఉన్నది అనేది అవ్యక్తమైన అంతరాత్మ వైపు సాగే ప్రయాణంలో సాధించిన పురోగతికి సూచిక.
0 notes